Thursday, September 17, 2020

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థితి. ఇదంతా కరోనా నియంత్రించడానికని జనం అనుకున్నారు కానీ ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు. అది చేసిందేమిటంటే ప్రజల కళ్లుగప్పేసి కీలక చట్టాలను సవరించడం. ఈ కాలంలో అది ప్రజల ఉమ్మడి ఆస్తులను ఎన్నింటినో అమ్మేసింది, లేదా అమ్మకానికి పెట్టింది. అన్నిటికన్నా ఎక్కువగా ప్రకృతి వనరులకు మార్కెట్ తలుపులు తెరిచేసింది. ఇదంతా ఎంత ఆబగా చేసిందో చూస్తే అందరూ ఆదమరిచి నిద్రపోయే నిశిరాత్రి కోసం దోపిడి దొంగలు మాటుగా సేది మనకు గుర్తొస్తుంది.

మార్చ్ నుండి పెట్టుబడిదారుల కోసం ఇచ్చిన పర్యావరణ అనుమతులు, చట్ట సవరణల కోసం తీసుకొచ్చిన ప్రతిపాదనలు చూస్తే సాధారణంగా ప్రభుత్వాల దోపిడి నైజం తెలిసినవాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. లాక్ డౌన్ టైంలో అటవీ ప్రాంతాల్లో గనులు, ప్రాజెక్టులు, రోడ్లు వంటి అనుమతులు వీడియో కాన్ఫరెన్సుల్లో ఇచ్చేశారు. మామూలుగా ఇలాంటి అనుమతులు రావడానికి నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే ఏమీ అడక్కుండా, చూడకుండా అన్ని కాగితాల మీద సంతకాలు పెట్టి అప్రూవల్స్ రావడానికి కూడా కొన్ని నెలలు పడుతుంది. ఏప్రిల్ 7న నేషనల్ బోర్డ్ ఫర్ వైల్ లైఫ్ (వన్య ప్రాణుల సంరక్షణ కోసం ఉండే జాతీయ సంస్థ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 30 ప్రతిపాదనలను ఆమోదిస్తూ అనుమతులలిచ్చేసింది. నిజానికి ఈ సంస్థ 2014 తర్వాత ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఇప్పుడు ఇంత హడావిడిగా సమావేశమైంది వన్య ప్రాణుల సంరక్షణ కోసమైతే కాదని తెలుస్తూనే ఉంది.

తాము చేసిన ఘనకార్యం గురించి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్ లో రాశాడు. తన ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో (వీడియో కాన్ఫరెన్స్) 11 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాము అని. ఇందులో నల్లమలలోని ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం సమీపంలో యురేనియం దగ్గరి నుండి తూర్పు, మధ్య భారతదేశంలో 41 కోల్ బ్లాక్స్ (బొగ్గు నిల్వలు) దాకా మైనింగ్ అనుమతులు ఉన్నాయి. బొగ్గు నిలువలున్న ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు, ఆదివాసీ ప్రాంతాలు. అంటే నియమానుసారం పర్యావరణ, అటవీ చట్టాలతో సహా ఆదివాసీ చట్టాలు కూడా వీటిని అనుమతించవు. 'ది వైర్' పత్రిక దీని గురించి రాస్తూ ఇండియాలో వన్య ప్రాణులకు అతి పెద్ద ప్రమాదంగా ఉన్నది దాని పరిరక్షణా సంస్లే అన్నది. ఇది అడవులకూ, పర్యావరణానికి కూడా వర్తిస్తుంది. తమాషా ఏమిటంటే మన దేశంలో పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖకు, భారీ పరిశ్రమల శాఖకు మంత్రి ఒకరే. ప్రకాశ్ జవదేకర్ కుడి చేత్తో పరిశ్రమలకు ప్రతిపాదనలు తీసుకొని ఎడమ చేత్తో వాటిని సాంక్షన్ చేస్తాడన్నమాట.

లాక్ డౌన్ సమయంలో పర్యావరణాన్ని, జనావాసాలను, ప్రజల జీవించే హక్కును దారుణంగా దెబ్బతీసే ఒక దుర్మార్గమైన చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. డ్రాఫ్ట్ ఇ.ఐ.ఎ. 2020 పేరుతో దానిని ముందు తీసుకొచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా పర్యావరణవాదుల నుండి మానవ హక్కుల సంస్థలు, ప్రజాసంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అససెస్మెంట్ 2020 డ్రాఫ్టు 2006 నాటి ఇ. ఐ.ఎ.కు కీలక సవరణలను ప్రతిపాదించింది. ఇంతకూ ఏమిటీ ఇ.ఐ.ఎ.? పర్యావరణ (పరిరక్షణ) చట్టంలో ఇది అంతర్భాగం. 1986 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టాన్ని మరింత పటిష్టం చేయడానికి 1994లో ఆ చట్టం కిందికి ఇ.ఐ.ఎ.ను చేర్చారు. 2006లో ఒకసారి ఇ.ఐ.ఎ.ను సవరించారు. సవరణ ఉద్దేశం దానిని మరింత ప్రజానుకూలం చేయడం. ఇందుకు సుదీర్ఘ ప్రజా ఉద్యమాలు, ముఖ్యంగా విస్థాపనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు దోహదం చేశాయి. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అససెస్ మెంట్ (ఇ.ఐ.ఎ.)ను తెలుగులో పర్యావరణ ప్రభావ అంచనా లేదా విశ్లేషణ అని వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఒక పరిశ్రమను గాని, ప్రాజెక్టును గాని ఒక ప్రాంతంతో నిర్మాణం చేయాలనుకుంటే దాని ప్రభావం పర్యావరణం మీద ఎలా ఉండబోతోందో ముందుగా అంచనా వేస్తారు. అక్కడి భౌగోళిక స్థితిగతులు, జీవవైవిధ్యం, వాతావరణం వంటివి వేరువేరు రుతువుల్లో ఎలా ఉంటాయో అధ్యయం చేసి రిపోర్టు తయారుచేయాలి. దీనితోపాటు సామాజిక ప్రభావాన్ని కూడా అంచనావేయాలి. తర్వాత ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ఊర్ల నుండి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. ఇందుకోసం కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఒక పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను చెప్పొచ్చు. దీనికి నెల రోజుల సమయం ఇస్తారు. నిజానికి ఈ చట్టం మరింత ప్రజానుకూలం, పర్యావరణ అనుకూలం చేయాల్సి ఉంది. పబ్లిక్ హియరింగ్ లో వ్యక్తమైన అభ్యంతరాలకు మొత్తంగా ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్న నియమమేమీ లేదు. ఇ.ఐ.ఎ. రిపోర్టు తయారుచేయడంలో, పబ్లిక్ హియరింగ్ లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇ.ఐ.ఎ.లో ప్రతిపాదించిన సవరణలు దానిని మొత్తానికి మొత్తంగా బలహీనపరిచేలా, దాని చేతులు విరిచేసేలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి చూద్దాం.

1) అన్నిటికన్నా ప్రమాదకమైన సవరణ 'పోస్ట్ ఫాక్టో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్’. దీని ప్రకారం కొన్నిరకాల అనుమతులు లేకపోయినా పరిశ్రమ మొదలు పెట్టి నడుపుకోవచ్చు. అలా పరిశ్రమ నడుపుకుంటూ కొంత సమయం తీసుకొని మెల్లగా అవసరమైన సర్టిఫికెట్స్ తెచ్చుకోవచ్చు. ఈలోగా ఫ్యాక్టరీ వల్ల ఏమైనా ప్రమాదం జరిగితే జరిమానా విధిస్తారు. ఇటీవలే విషవాయువు లీకైన ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ ఇరవై ఏళ్ళ నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే నడుస్తోంది. అలాంటివి దేశంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అట్లా అక్రమంగా నడుస్తున్న పరిశ్రమలన్నీ ఈ సవరణతో చట్టబద్ధం అయిపోతాయన్నమాట.

2) ప్రజాభిప్రాయ సేకరణకున్న 30 రోజుల గడువును 20 రోజులకు కుదిస్తున్నారు. లాక్ డౌన్ లో కొన్ని ప్రాజెక్టులకు చడీచప్పుడు కాకుండా అనుమతులిచ్చారని పైన చెప్పుకున్నాం. కొన్నిటికి పబ్లిక్ హియరింగ్ అయిపోయిందని కూడా చెప్పారు. స్థానిక ప్రజలు లేకుండా స్టేజ్ డ్రామాల్లాగా పబ్లిక్ హియరింగ్ జరపడం, నిజమైన ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ప్రజలు ఆందోళన చేయడం గతంలో చాలా సార్లు జరిగింది. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా కొన్ని రకాల అభివృద్ధి ప్రాజెక్టులకు, ఉదాహరణకు నీటిపారుదల ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, రక్షణ అవసరాల కోసం చేపట్టే నిర్మాణాలు వంటివాటికి పబ్లిక్ హియరింగ్ అవసరం లేదని సవరణ చేస్తున్నారు.

3) ఏదైనా ప్రాజెక్టు/పరిశ్రమ వల్ల పర్యావరణానికి నష్టం కలిగితే సంబంధిత అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. సాధారణంగా బాధిత ప్రజలు, వారి తరపున సామాజిక కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తుంటారు. ఇప్పుడు సవరిస్తున్న నిబంధనల ప్రకారం ఇక ఆ అవకాశం ఉండదు. ఫిర్యాదు చేసే అధికారం ప్రభుత్వ ఏజెన్సీలకు, ప్రాజెక్టు సభ్యులకు మాత్రమే ఉంటుంది. ఇదెంత తమాషానో చూడండి. మేం తప్పు చేశామని ఎవరికివారే కంప్లైంట్ చేసుకోవాలట!

4) ఎకో సెన్సిటివ్ జోన్ (సున్నితమైన జీవావరణాలు) నిర్వచనాన్ని బలహీనపరిచే సవరణ మరొకటి. దీని ప్రకారం ఇదివరకు అవకాశం లేని జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి ప్రాజెక్టులు కట్టుకోవచ్చు). చిన్నవాటిని పెద్దవిగా విస్తరించుకోవచ్చు.

5) ఔషదాలను (డ్రగ్స్) పునర్ వర్గీకరణ (రీ-కేటిగరైజేషన్) చేశారు. ఫార్మా పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే మందులను బట్టి, అవి తయారయ్యే క్రమంలో గాలి, నీరు, నేలలోకి వెలువడే వ్యర్థాలను బట్టి వాటి వర్గీకరణ ఉంటుంది. దీనిని సవరిస్తూ ప్రమాదకరమైన '' వర్గం (కేటగరీ)లో ఉండే కొన్ని రసాయనాలను ప్రమాదకరం కాని 'బి2' వర్గం కిందికి తీసుకొచ్చారు. బి2 కింద ఉండేవాటికి ఇ.ఐ.ఎ. వర్తించదు.

ఇలాంటి సవరణతో తీసుకొచ్చిన కొత్త ఇ.ఐ.ఎ. నిబంధనల ప్రతిని 'ఇ.ఐ.ఎ. 2020 నోటిఫికేషన్ డ్రాఫ్ట్' పేరిట ఇంటర్నెట్లో పెట్టి జూన్ 30 వరకు గడువిస్తూ ప్రజల అభిప్రాయాలు కోరారు. దీని గురించి ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఇవ్వడం గాని, మీడియాలో మాట్లాడటం కానీ చేయలేదు. లాక్ డౌన్ లోపలే ఈ తంతును ముగించాలని ప్రభుత్వం అనుకుంది. ఈ కాలమంతా ప్రభుత్వం ఎన్ని అసంబద్ధ విషయాల చుట్టూ ప్రజల ఆలోచనలు మళ్లించిందో మనం గుర్తుచేసుకుంటే దాని కుట్ర అర్థమవుతుంది. అయితే దేశవ్యాప్తంగా పర్యావరణవాదులు, సంస్థలు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కరోనా లాక్ డౌన్లో జనం కన్నుగప్పి ఇటువంటి కీలకమైన విధాన నిర్ణయం తీసుకోవడాన్ని ఆక్షేపించారు. దీనిని కోర్టులో సవాలు చేయగా గడువు ఆగస్టు 11కు పెంచారు. కేవలం గడువు పెంచితే సరిపోదు, ఈ డ్రాఫ్ట్ ఏమిటో ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని, కనుక ఇది ఇంగ్లీషు, హిందీలో మాత్రమే కాక 22 ప్రాంతీయ భాషల్లో ఉండాలని ఢిల్లీ, కర్ణాటక హైకోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిల్ కొట్టేయాలని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పోయింది కానీ కోర్టు తిరస్కరించింది. ఇంత మాత్రమే కాదు, డ్రాఫ్ట్ ఇ.ఐ.ఎ.కు వ్యతిరేకంగా జరగుతున్న ప్రచారాన్ని అది నిస్సిగ్గుగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న వివిధ సంస్థలు డ్రాఫ్ట్ ఇ.ఐ.ఎ. గురించి పెద్ద ఎత్తున ఆన్లైన్ ప్రచారం చేశాయి. ఇ.ఐ.ఎ. 2020ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ అవి సంబంధిత శాఖకు ప్రజల నుండి వేలాది ఈ మెయిల్స్ వెళ్లేలా చేశాయి. దీనిని కూడా సహించలేని ప్రభుత్వం Let India Breathe, There is no earth B, Fridays for future వంటి వెబ్ సైట్స్ ను బ్లాక్ చేసింది. వాటి మీద ఐటి చట్టం, ఊపా చట్టం కూడా ప్రయోగించబోయింది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వచ్చాక వెనక్కి తగ్గింది. ఆగస్టు 11 నాటికి 17 లక్షల మంది డ్రాఫ్ట్ ఇ.ఐ.ఎ.పై స్పందిస్తూ ఈ మెయిల్స్ పంపారు.  

ఇక 22 ప్రాంతీయ భాషల్లో డ్రాఫ్ట్ ను ప్రచురించాలన్న విషయంపై న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వ వాదన హిందీ భాషాధిపత్యాన్ని చాటేలా ఉంది. హిందీ అధికార భాష కాబట్టి ప్రాంతీయ భాషల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అది వాదించింది. (సెప్టెంబర్ 23న దీనిపై తదుపరి వాదనలు జరగనున్నాయి.) అసలు ఏదైనా ప్రజలకు అర్థం కావాలంటే వారి మాతృభాషలో ఉండాలన్న కనీస ఇంగితం దానికి లేకుండా పోయింది అనేకన్నా, ప్రజాభిప్రాయం పట్ల దానికి ఎంత మాత్రం గౌరవం లేదని, దానికి కావలసింది పెట్టుబడిదార్ల ప్రయోజనాలను యుద్ధ ప్రాతిపదికన నెరవేర్చడమేనని అనుకోవడం సరైనది.

కరోనాను అవకాశంగా తీసుకొని తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మేధావులను, విద్యార్థులను, నిరసన తెలిపిన సాధారణ ప్రజలను 1300 మందిని అరెస్టులు చేసిన ప్రభుత్వం నుండి ఏ నైతికతా ఆశించలేం. ఆరోగ్య అత్యాయక స్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)ని రాజకీయ అత్యాయక స్థితిగా మార్చివేసిన ప్రభుత్వం దేశాన్ని సంపూర్ణంగా కొల్లగొట్టడానికే కీలకమైన విద్య, వ్యవసాయ, పర్యావరణ విధానాలలో విధ్వంసక మార్పులు చేస్తున్నది. వీటిపై ఎక్కడా చర్చ లేకుండా చేయడానికి మీడియాతో అసహ్యకరమైన ఫీట్లు చేయిస్తున్నది. కనుక మనం చేయవలసింది వీటిని వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయడం.

(September 15, 2020, virasam1970.blogspot.com)

Thursday, September 3, 2020

పర్యావరణ పరిరక్షణ ఉద్యమం

WE DRAVIDIANS (మేము ద్రావిడులం) ఫేస్ బుక్ పేజ్ కోసం ఆగస్టు 29న ఇచ్చిన లైవ్ వీడియో
అంశం: పర్యావరణ పరిరక్షణ ఉద్యమం 

FACEBOOK PAGE : https://www.facebook.com/WeDravidiansEN/

FACEBOOK VIDEO LINK : https://www.facebook.com/watch/?v=754643885370474&extid=zVrhIhHP9VjKHtiU

 

Sunday, June 28, 2020

విషవాయువుల గుప్పిట ఉత్తరాంధ్ర

 
మే 7 మధ్యరాత్రి దాటాక విశాఖ శివారులో గాలి ఆకస్మికంగా బరువెక్కింది. ఊపిరితిరక్క ఉలికిపడి లేచి చూస్తే మంచుగా అగుపించిన ఘాటైన రసాయనాల పొగ. వందలువందలుగా కుప్పకూలిపోతున్న జనం. 12 మరణాలు. కిక్కిరిసిన ఆసుపత్రులు. జీవం కోల్పోయిన పాడి, పంట. మసైపోయిన ప్రకృతి. లాక్ డౌన్ తర్వాత తెరుచుకున్న ఎల్.జి.పాలిమర్స్ హఠాత్తుగా అన్లాక్ చేసిన విషం గోపాలపట్నం పరిసరాలను నిర్జీవంగా మార్చివేసింది. నిలువ వుంచిన ట్యాంకు నుండి ఏకంగా 800 టన్నుల స్టెరిన్ గ్యాస్ గాలిలో కలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే మూడు వేల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నది కాని నిజానికి దీనివల్ల విస్తృతమైన, దీర్ఘకాలిక ప్రభావాలుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవి ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికి అంచనా లేదు. ఎందుకంటే ఈ అనుభవం కొత్తది కాబట్టి. అలా విశాఖ ప్రపంచానికి ఒక పరిశోధనా వస్తువైంది. 

ఇంతకూ స్టెరిన్ గ్యాస్ ఎలా లీకయ్యింది? ట్యాంకుకు అనుసంధానమైన రెఫ్రిజిరేషన్ యూనిట్లో సమస్య ఉందా? విరుగుడు రసాయనం ఎందుకు అందుబాటులో లేదు? గ్యాస్ లీకైనప్పుడు అలారం ఎందుకు ఇవ్వలేదు? అంచనాకు మించిన ప్రభావం కనపడుతున్నదంటే స్టైరితోపాటు ఇంకేమైనా రసాయనం కలిసిందా? సాంకేతిక ప్రశ్నలు ఎలాగూ ఉంటాయి. కానీ గుర్తించవలసింది ఏమిటంటే ఇది పైకి కనపడినట్లు హఠాత్తుగా వచ్చిపడ్డ విపత్తు కాదు. ఏ ఒకరిద్దరి నిర్లక్ష్యమో దీనికి కారణం కాదు. ఈ క్షణం కాకపోతే మరుక్షణం పేలవలసిన బాంబు అక్కడ ఎప్పటి నుండో సిద్ధంగా ఉంది. క్షణకాలంలో జరిగిపోయే ఆక్సిడెంట్స్ వెనక కూడా దీర్ఘకాలావధిలో కార్యాకారణ సంబంధాలుంటాయి.

స్టెరిన్ గ్యాస్ అనుభవం కొత్తది కానీ, మనకు పాతికేళ్ళనాటి మిథైల్ ఐసోసయనైడ్ (భోపాల్ గ్యాస్) దారుణ అనుభవం ఉంది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ యజమాని దర్జాగా దేశం దాటడం, బాధితులు అలా శాపగ్రస్తుల్లా మిగిలిపోవడం ఇవన్నీ ఇండియాలో రానున్న పరిణామాలకు ఆనాటి సూచికలు. అయితే ప్రజల నుండి వడ్చిన ఒత్తిడి మూలంగా పాలకులు ఫ్యాక్టరీల చట్టం ఒకటి చేశారు. ప్రమాదకర పదార్థాలతోనూ, ప్రక్రియలతోనూ వ్యవహరించే పరిశ్రమలకు తప్పనిసరిగా పాటించాల్సిన విధివిధానాలను ఆ చట్టంలో పొందుపరిచారు. అటువంటి ఫ్యాక్టరీలలో ప్రమాదాలను నివారించడానికి పాటించాల్సిన భద్రతా ఏర్పాట్ల కోసం ఒక కమిటీ ఉండాలి. అందులో కార్మికులకు కొన్ని నిర్ణయాధికారాలు ఉండాలి. ఏదైనా జరిగితే తీసుకోవలసిన తక్షణ జాగ్రత్తల గురించి కార్మికులకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలి. స్టెరీన్ వాయువు ప్రమాదకర రసాయనాల జాబితాలో లేదు. అయితే అలా గుర్తించబడిన రసాయనాల పరిశ్రమల్లో కూడా చట్టాలు అమలు కావు. రిస్క్ ఎదురుకుంటూ పనిచేస్తున్న కార్మకుల కోసం వారి పనిస్థలాల్లో పాటించాల్సిన ప్రమాణాలకు సంబంధించిన చట్టాలుకూడా ఉన్నాయి. అసలు పరిశ్రమల స్థాపనకు అనుమతుల విషయంలో చెప్పుకోదగ్గ పర్యావరణ చట్టాలున్నాయి. ఒక్క విశాఖపట్టణాన్నే తీసుకున్నా ఇవన్నీ కాగితాలకే పరిమితమని, అధికారులు ఆఫీసులకే పరిమితమని, ఇంకా చెప్పాలంటే క్రిమినల్ పెట్టుబడిదారులకే అనుకూలమని బల్లగుద్ది చెప్పొచ్చు.

ఎల్.జి.పాలిమర్స్ విషయంలో ఏం జరిగింది? అసలు దానికి పర్యావరణ అనుమతి లేదు. నాలుగేళ్ళ క్రితం ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, సాధారణ తనిఖీల సమయంలో అధికారికంగానే బైటపడింది. అయినా ఫ్యాక్టరీ విస్తరణకు కాలుష్య నియంత్రణ మండలి (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు - పిసిబి) నుండి అనుమతులొచ్చాయి. అన్నీ తెలిసిన పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నిద్ర నటించింది. అన్నిటికన్నా విచిత్రమేమిటంటే లాక్ డౌన్ తర్వాత ఈ ఫ్యాక్టరీ నడుపుకునే అనుమతి ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటంటే అది తక్షణ ప్రజా అవసరాల కిందికి వస్తుందని! ఒక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమ తక్షణ అవసరం ఎలా అయింది?

ఎల్.జి.పాలిమర్స్ నేర చరిత్ర, దానికి ప్రభుత్వాల ప్రత్యక్ష అండ ఈనాటిది కాదు. అసలు 1961లో హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో మొదట వచ్చిన కంపెనీ చేతులు మారుతూ వచ్చి 1997లో ఎల్.జి.పాలిమర్స్ పరమయ్యేనాటికే విలువైన ప్రభుత్వ భూములు ఒకరి తర్వాత ఒకరు కాజేసి లాభపడ్డారు. ఎల్.జి. వచ్చాక చుట్టుపక్కల భూముల్ని కూడా అది మింగేసింది. వారి భూదందాకు అన్ని ప్రభుత్వాలు సహకరిస్తూ వచ్చాయి. ఇదంతా ఇంకో కథ అవుతుంది గాని చుట్టుపక్కల జనావాసాలు విస్తరిస్తూ వచ్చాక కూడా ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతులిచ్చి, అదీ నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి పర్యావరణ ప్రభావ మదింపు చేయకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి పిసిబి కూడా నేరంలో భాగస్వామి అయింది. ఎవరైతే కాలుష్య నియంత్రణకు ఫ్యాక్టరీలను నియంత్రించాలో వారే ఫ్యాక్టరీ యజమానులతో చేతులు కలపడం కొత్త విషయమైతే కాదు.

ఇటువంటివన్నీ అవినీతి, నిర్లక్ష్యం, నియమాల అతిక్రమణలుగా కనపడతాయి కానీ ఫ్యాక్టరీల విషయంలో ఇవి 'దేశ ఆర్థికాభివృద్ధి' కోసం, ‘ప్రజాప్రయోజనం' కోసం రాజీపడవలసిన విషయాలుగా మాట్లాడుతున్నారు. పెట్టుబడిదారులు ఏ ఇబ్బందులు లేకుండా సులువుగా కంపెనీలు నడపగలిగే వాతావరణం ప్రభుత్వమే కల్పించాలంటున్నారు. దీనినే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. అంటే పర్యావరణ అనుమతులు, కార్మికుల, ప్రజల భద్రత కోసం చేసిన ఫ్యాక్టరీ చట్టాలు సడలించాలని, అప్పుడే పెట్టుబడులను ఆకర్షించగలం అని ప్రభుత్వాలు ఏకంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చట్టాల అమలు గురించి మనం మాట్లాడితే, అసలు చట్టాలనే రద్దు చేసే నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.

ఎల్.జి.ఘటన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి ముందుకొచ్చి అది చాలా ప్రతిష్టాత్మక కంపెనీ అని మాట్లాడాడు. మామూలుగా నష్టపరిహారం కంపెనీ నుండి రాబట్టాలి. కానీ కోటి రూపాయల పరిహారమిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన ఉదారత చాటుకుంది. ప్రభుత్వం కితాబిచ్చిన ప్రతిష్టాత్మక కంపెనీ, నిజంగానే తన ప్రతిష్టతో అన్ని చట్టాలను ఉల్లంఘించి, లాభాలు దండుకొన్నది. ప్రజలు బలిపశువులై, అంతా బట్టబయలైన తర్వాత కూడా అది తన ప్రతిష్టతో దర్జాగా లోపల నిలువవున్న సరుకును దేశం దాటించి అమ్ముకుని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంది. స్టైరీన్, పెంటేన్ వంటి రసాయనాల స్టాకు కొరియాకు తరలించడానికి విశాఖ పోర్టు నుండి ప్రత్యేకంగా నౌకలను ఏర్పాటు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహకారాన్ని అందించింది. ఆందోళన చేస్తున్న ప్రజలను ఈడ్చేసి, టెంటు పీకేసిన పోలీసులు కంపెనీ పెద్దమనుషులతో ప్రశాంతంగా చర్చలు జరిపారు. కంపెనీని సీజ్ చేయకుండా ప్రమాదం జరిగిన ఆధారాలను పూర్తిగా తుడిచేశారు. ఎక్కడా దాపరికం లేకుండా ఇదంతా బహిరంగంగా జరిగింది. ఇక యాజమాన్యాన్ని అరెస్టు చేయడమా? ఎంత దురాశ! కొసమెరుపేమిటంటే అంతా అయ్యాక హైకోర్టు ఫ్యాక్టరీని సీజ్ చెయ్యమని ఆదేశించింది.

ఇది ఎల్.జి. కథ మాత్రమే కాదు.

భోపాల్ విషాదం తర్వాత నేర్చుకున్న పాఠాలేమిటి? బహిరంగంగా కంపెనీలకు వస్తాసునివ్వడం, ప్రజల నోర్లు మూయించడం ఎలా అని. కనుక విశాఖ చుట్టూ ఉన్న సుమారు 80 పరిశ్రమలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్.జి. ఘటన సందర్భంగా గతంలో ఈ ప్రాంతంలో జరిగిన అనేక ప్రమాదాలు కూడా చర్చకు వచ్చాయి. 1997లో హెచ్.పి.సి.ఎల్. గ్యాస్ ట్యాంకులు పేలినప్పుడు 60 మంది చనిపోయారు. జనమంతా ప్రాణాలరచేతబట్టుకొని కొండలు, గుట్టలెక్కి పారిపోయారు. అదే కంపెనీలో మళ్ళీ నాలుగేళ్ళ క్రితమే కూలింగ్ టవర్ కూలిపోయి 38 మంది చనిపోయారు. 2012లో విశాఖ స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీకై ట్యాంకర్ పేలిపోవడంతో 19మంది చనిపోయారు.

ఇక విశాక పరవాడ ఫ్మాసిటీ ప్రాంతం ప్రత్యక్ష నరకం. ఇక్కడ ప్రమాదాలు జరగడం రివాజు. గత ఏడేళ్ళలో 30 ప్రమాదాలు జరిగినట్లుగా పత్రికలు రాశాయి. నలభై మంది కార్మికులు మరణించగా, వందమందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఫార్మాసిటీలో ప్రస్తుతం 72 కంపెనీలు పనిచేస్తుండగా, మరో 25 ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయి. ఫార్మాసిటీలో 2006 నుండి ఉత్పత్తి మొదలైంది. ఇక్కడి పరిసరాల్లో భరించలేని దుర్వాసన. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మామూలైపోయాయి. ఫార్మాసిటీ నిర్మాణం కోసం మొదట 9 గ్రామాలు విస్థాపనకు గురైతే ఇప్పుడు మరికొన్ని గ్రామాల ప్రజలు తమను అక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది హృదయం ద్రవించే దయనీయ స్థితి. అవసరం తీరిపోయింది కనక అక్కడి ప్రజలను పట్టించుకునే అగత్యం కంపెనీలకుగాని, ప్రభుత్వానికిగాని లేదు. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఫ్యాక్టరీలన్నిటిలో వెయ్యిమంది నిర్వాసితులకు మాత్రమే ఉపాధి దొరికింది. అభివృద్ధిలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తామని ప్రభుత్వ అంటూ ఉంటుంది. కానీ వాస్తవంగా అది బలిచేస్తుంది. ప్రజలను, ప్రకృతిని కూడా.

పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉండడం, కాస్త సంచలన వార్త అయినప్పుడు (ఎల్.జి. పాలిమర్స్ విశాఖ నగరానికి అతి సమీపంలో ఉంది కాబట్టి వార్త అయింది) హడావిడి చేయడం తప్ప అసలు సమస్య ఎక్కడుంది అన్న చర్చ జరగదు. ఒకవేళ జరిగినా ఇవన్నీ మానవ తప్పిదాలుగా నమోదవుతాయి. ఇలా నమోదు కావడం అంటేనే, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఏమీ చేయలేం అని చెప్పడం. చేసేదేమైనా ఉంటే సాంకేతిక కారణాలేవో వెలికితీసి ఒకరిద్దరు ఉద్యోగుల మీద తాత్కాలిక చర్యలు తీసుకొని, బాధితులకు పరిహారం ఇచ్చి సమస్యను మూసేస్తారు.

ఇక్కడ సమస్యను మూసేయడం అంటే ఫ్యాక్టరీ యజమానులకు కలిగిన అసౌకర్యాన్ని తొలగించడం తప్ప మరొకటి కాదు. నష్టపరిహారం ఏ అర్థంలో చూసినా అసలు నష్టపరిహారం కాదు. పోయిన ప్రాణాల గురించి, ప్రజారోగ్యం గురించే కాదు, పర్యావరణానికి కలిగిన నష్టం ఏ విధంగానూ పరిహరించలేదు. పోనీ ఇకనైనా మరింత నష్టం జరగకుండా చూడాలంటే ముందు సమస్యను గుర్తించి అంగీకరించాలి. సమస్య ప్రభుత్వ విధానాలలో ఉంది. కార్పొరేట్ పెట్టుబడి పేరాశలో ఉంది. దానిది ఎన్నటికీ తీరని లాభాల దాహం. భూగోళాన్నే దహించివేసే ఆకలి. ఈ అప్రతిహత దోపిడి కోసం పథకాలు రూపొందించి, ప్రభుత్వాల తమ చెప్పుచేతల్లో పెట్టుకొని వారిద్వారా విధానాలను అమలు చేస్తారు గనక ఇవి ప్రణాళికాబద్ద నేరాలు.

ఈ నేరాలే విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాలను అంతకంతకూ కాలుష్యకాసారం చేస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక కాలుష్యం సగటుకన్నా అనేక రెట్లు పెరిగిపోయింది. మితిమీరిన సంఖ్యలో పరిశ్రమల వుండడం ఒక సమస్య అయితే విశాఖ భౌగోళిక స్వరూపం వల్ల కూడా ఇక్కడ కాలుష్యం కేంద్రీకృతమవుతోంది. చుట్టూ మూడువైపులా కొండలు, ఒకవైపు బంగాళాఖాతంతో విశాఖ ఒక స్పూన్ ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ వెలువడిన కాలుష్యం బైటికెళ్ళడానికి అవకాశం తక్కువ. ఫలితంగా వాయికాలుష్యం ఇక్కడి వాతావరణంపై మరింత ఎక్కువ ప్రభావం వేస్తోంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు, తుఫాన్లు, అతివృష్టి రూపంలో ఇప్పటికే వాతావరణ మార్పు కనపడుతోంది. ఈ దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాలు కూడా కార్పొరేట్ నేరాల జాబితాలో వేయవలసిందే.

విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ప్రభుత్వ విధానాలవల్ల ప్రమాదకర పరిశ్రమలెన్నో వచ్చాయి. మరెన్నో రాబోతున్నాయి. పైడిభీమవరం, చిలకపాలెం పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించారు. ఈ ప్రాంతాల్లోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల నుండి కాపాడేపని మాది కాదంటూ పరోక్షంగా ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. అంతే కాదు. కంపెనీ యజమానులతో చేతులు కలిపాయి కూడా. 2012లో శ్రీకాకుళం నాగార్జున అగ్రిపరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను ఇళ్ళు వదిలి పారిపొమ్మని స్వయంగా కలెక్టరే చెప్పాడట!

ఉత్తరాంధ్ర పరిశ్రమల్లో సుమారుగా అన్నీ ప్రత్యేక ఆర్థిక మండలాల్లో నెలకొల్పినవే. ముందు చెప్పిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలు కాబట్టి ఇక్కడ కంపెనీల యజమానులు సాధారణ నియమాలు కూడా పాటించక్కర్లేదు. కారుచవకగా కావలసినంత భూమి, ఎయిర్ పోర్టు, సముద్రతీరం, వీటితో పాటు వెనుకబాటుతనం వల్ల కారుచవకగా శ్రామికులు కూడా దొరుకుతారుగనక ఉత్తరాంధ్రలో పెట్టుబడిదారులు పాగావేస్తున్నారు. ప్రజా ఉద్యమాల వల్ల సోంపేట, కాకరాపల్లి వంటి ప్రాంతాల్లో థర్మల్ కేంద్రలు రాకుండా వెనక్కిపోయాయి గాని కొవ్వాడలో అత్యంత భారీ అణువిద్యుత్ కేంద్రం కోసం భూసేకరణ జరిగింది. ఇది ఒకరకంగా ఉత్తరాంధ్రను ఆటంబాంబు మీద కూర్చోబెడుతోంది.

ఉత్తరాంధ్ర తూర్పుకనుమల చెంత ఉంది. వనరులు పుష్కలం. భూములు బంగారం. వ్యవసాయానికే కాదు, మత్స్యసంపదకు కొరవలేని ప్రాంతం. కానీ పాలకులకు ఇక్కడి వనరులను సొమ్ముచేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. అద్భుతమైన జీవవైవిధ్యం, నదీ ప్రవాహాలు, పచ్చని ప్రకృతి, జీవసంపదతో అలరారే తూర్పు కనుమలు ఇప్పటికే చాలా విధ్వంసానికి గురయ్యాయి. అటవీ భూములు ఆక్రమణలపాలయ్యాయి. బాక్సైట్ తవ్వకాల కోసం నెత్తురెంతో పారించిన ప్రభుత్వాలు పట్టువదలని ప్రజా ఉద్యమాల ఫలితంగా వెనక్కితగ్గాయి కానీ అవకాశం కోసం చూస్తూనే వున్నాయి. ప్రభుత్వాలకు ప్రజల పట్ల, పర్యావరణం పట్ల ఎంత బాధ్యత ఉంటుందో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విస్తరించిన రసాయన పరిశ్రమలు దేశంలోనే చెప్పుకోదగ్గ ఉదాహరణగా నిలిచాయి.

ఉత్తరాంధ్ర ఒకవైపు విషవాయివుల మధ్య చిక్కుకుంటోంది. అయితే మరో చివర నుండి ఈ చిక్కుముడిని ఛేదించే పోరాటం కూడా చేస్తోంది. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుని తూర్పు కనుమల జీవసమతుల్యాన్ని కాపాడిన సాయుధపోరాటం నుండి సోంపేట ఉద్యమం దాకా పర్యావరణ చట్టాలు, కోర్టులు చేయలేనిపని ప్రజలు ఎలా చేయగలరో చెప్పే అనుభవాలు దానికున్నాయి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం మీద, ప్రభుత్వాల వివక్ష మీద చదువుకున్న మధ్యతరగతి ఇప్పుడు మాట్లాడుతోంది. అభివృద్ధి పేరుతో జీవావరణం పై జరుగుతున్న దోపిడిని ఆ చర్చల్లో భాగం చేయగలగాలి. రేపు రాజధాని పేరుతో జరగబోయే మరింత విధ్వంసం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రకృతిని కొల్లగొడితే దానిని ఎన్నటికీ వెనక్కి తెచ్చుకోలేం.

(అరుణతార, ఏప్రిల్ -జూన్ 2020)

 

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థి...