Wednesday, July 17, 2019

నల్లమలపై అణుబాంబు

నల్లమలలో 83 చదరపు కిలోమీటర్ల అడవిని తన అజమాయిషీలోకి తీసుకొని, భూమిని చీలుస్తూ సుమారు 4000 బోర్లు వేసి అణుశక్తికి మూలమైన ముడి యురేనియం ఖనిజాన్ని అన్వేషించడానికి కేంద్ర అణుశక్తి సంస్థ సన్నాహాలు చేసుకుంటోంది. 83 చదరపు కిలోమీటర్లు అంటే సుమారు 21,500 ఎకరాలు. వందల కిలోమీటర్ల విస్తరమైన కొండకోనల్లో ఈ చిన్న ముక్క శాంపిల్‌ సర్వే కోసం తీసుకుంటున్నారట. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలు దండిగా ఉన్నాయని, ముఖ్యంగా అమ్రాబాద్‌ నుండి నాగార్జునసాగర్‌ దగ్గర పెదగట్టు దాకా భూగర్భంలో ఈ అమూల్యమైన సంపద నిక్షిప్తమై ఉన్నదని, అదంతా వెలికితీయాల్సిన అవసరముందని అంటున్నారు. ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద పులుల అభయారణ్యం. అతిపెద్దదైన శ్రీశైలం నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ దీనికి ఎంతో దూరంలో లేదు. మానవ ఆవాసాలు వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలిగిస్తాయని ఆదివాసుల్ని తరిమేసే పర్యావరణ, వన్యప్రాణి విభాగాలు ఇప్పుడు నంగినంగి మాటలతో యురేనియం తవ్వకాలకు అంగీకరించడం కుట్రపూరితం. నిజానికి అభయారణ్యాలుగా గుర్తించి నేషనల్‌ పార్కులు, టైగర్‌ జోన్లు ఏర్పాటు చేసి వీళ్లు చేసిన సంరక్షణ వాస్తవంగా ఏమీ లేదు. అంతకన్నా మెరుగ్గా, నిజాయితీగా అడవిని, అందులోని వన్యప్రాణుల్ని సంరక్షించేది ఆదివాసులే. అదలా ఉంచి, నల్లమల ఇటీవలి కాలంలో విధ్వంసానికి గురవుతూ వస్తోంది. అత్యంత ప్రాచీన చెంచు జాతి ఆదివాసులతో పాటు అద్భుతమైన జీవవైవిధ్యం, అమూల్యమైన వృక్షసంపద నల్లమల సొంతం. ఈ అడవి మీద స్మగ్లర్ల దగ్గరి నుండి డిబీర్స్‌ వంటి మల్టీనేషనల్‌ వజ్రాల కంపెనీల దాకా చిన్న, పెద్ద దొంగలందరి కన్ను ఎప్పుడో పడింది. వందలాది ఎన్‌కౌంటర్ల తర్వాత ఇక్కడి నుండి మావోయిస్టులు వెనక్కి తగ్గాక అడవికి, ఆదివాసులకు కనీస రక్షణ లేకుండా పోయింది. దోచుకున్నవాడికి దోచుకున్నంత.

టైగర్‌ జోన్‌ పేరు చెప్పి మొదట అమాయక చెంచుల్ని అడవి నుండి దూరంగా నెట్టేసారు. ఇప్పుడు పులులతో పాటు అడవికి ప్రమాదం ముంచుకొచ్చింది. కానీ మనుషులే అడ్డుకోలేకపోయిన విధ్వంసాన్ని పులులేం అడ్డుకుంటాయి? ఇక పర్యావరణ మరియు అటవీశాఖ వాస్తవానికి పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖలా పనిచేస్తున్నది. అడవుల్ని రక్షించడానికి కాదు, అడవుల్ని పెట్టుబడిదారులకు అప్పగించడానికే ఇది ఉంది. మొదటి దశలో వన్యప్రాణి రక్షణకు టైగర్‌ రిజర్వ్‌ అన్నారు. రెండో దశలో దేశ రక్షణకు యురేనియం అంటున్నారు. ఇదొక భూతం వంటిది. ఈ తవ్వకాలే మొదలు పెడితే దేశభద్రత, గోప్యత పేరు మీద అయిదంచల పోలీసు రక్షణ పెడతారు. ఇలా చాటుమాటుగా అడవిని మొత్తం ఆక్రమిస్తారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. 2008 నుండి 2014 వరకు యురేనియం నిక్షేపాల అన్వేషణ జరిగింది. 2014లో ఆమ్రాబాద్‌ పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. దీనికన్నా ముందు నాగార్జునసాగర్‌ వద్ద పెదగట్టు-లంబాపూర్‌ ప్రాంతంలో యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యుసిఐఎల్‌) యురేనియం తవ్వకాల ప్రతిపాదనతో వచ్చింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, విప్లవోద్యమమూ ఉంది. వెల్లువెత్తిన ప్రజానిరసనలతో ఆ ప్రాజెక్టు వెనక్కిపోయింది. ఆ తర్వాత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఫ్యాక్షన్‌ కంచుకోట పులివెందుల ప్రాంతంలో ప్రజల్ని భయపెట్టి, బెదిరించి, నిరసనలను అణిచేసి యురేనియం మైనింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసారు. అక్కడ లభించే ఖనిజం యుసిఐఎల్‌ ప్రమాణాల ప్రకారమే అత్యంత తక్కువ శాతం. దానిని నెలకొల్పి పదేళ్లు దాటింది. అక్కడి ప్రజల బాధలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏం జరుగుతుందని భయపడి ప్రజలు ప్రాజెక్టును ప్రతిఘటించారో, అవేవీ జరగకుండా చూసుకుంటాం అని హామీ ఇచ్చి మోసం చేసింది యుసిఐఎల్‌. భూగర్భం నీళ్లు లేక ఒట్టిపోయింది. పంటలు, పశువులు దెబ్బతిన్నాయి. కాలుష్యం, రోగాలు మెల్లగా కబలిస్తున్నాయి. ఇది దశాబ్దాల క్రితం జార్ఖండ్‌ రాష్ట్రంలోని జాదూగూడలో మొదలుపెట్టిందే. విధ్వంసం కొనసాగుతోంది.

ఇప్పుడా మహమ్మారి మళ్లీ నల్లమలకొచ్చింది. అన్నట్లు మధ్యలో డిబీర్స్‌ కంపెనీ ఊసు కూడా గాలిలో తిరిగింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని ఎన్నికల ముందు హామీలిచ్చిన రాజకీయ పార్టీలు ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. ప్రజలు, పర్యావరణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఎప్పుడూ నోరుపారేసుకునే తెలంగాణ ముఖ్యమంత్రి నోరుమెదపడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సరేసరి. వాళ్ల నాయన రాజన్న రాజ్యంలోనే, తమకు రాజకీయ భిక్ష పెట్టిన పులివెందుల ప్రాంత ప్రజలమీదే అణు కుంపటి పెట్టారు. తమ వనరుల తమ కొలువులు, తమకే దక్కాలని పోరాడిన తెలంగాణ మునుపెన్నడూ లేనంతగా స్వరాష్ట్రంలో వనరుల విధ్వంసానికి గురికాబోతోంది. బహుషా యురేనియం అన్వేషణ దగ్గర దారి తెరుచుకుంటే ఇది దేశంలోనే అతి పెద్ద విధ్వంసం కాగలదు. తమకు గర్వకారణమైన, సుభిక్షమైన నల్లమల కొండకోనలను తమ పాలకుల చేతులమీదే ధ్వంసం అయ్యే దుస్థితిని తెలంగాణ ప్రజలు చూడబోతున్నారా? హరితహారాల ప్రహసనం ఆ ఢిల్లీ స్వాముల ముందు తేలిపోతుందా? సీమాంధ్రుల పెత్తనం నుండి ఢిల్లీ రాజుల ఆక్రమణలోకి తెలంగాణ వనరులు వెళ్లిపోతాయా? లేక ఏ కాస్తైనా స్వజాతి ఆత్మగౌరవం తెలంగాణ పాలకుల్లో మిగిలి ఉంటుందా?

తన తండ్రి చివరి ఆనవాళ్లను నిక్షిప్తం చేసుకున్న నల్లమల మీద జగన్మోహన్‌ రెడ్డికి ఏ సెంటిమెంటూ ఉండకపోవచ్చు.

కృష్ణా, పెన్నా ఆదరువుతో బతుకుతున్న ప్రజానీకం మాత్రం నల్లమల చల్లని నీడలేకపోతే బతకడం కష్టం. మొట్టమొదట యురేనియం కృష్ణను కలుషితం చేస్తుంది. ఈ విధ్వంసం ఆమ్రాబాద్‌ దగ్గర ఆగేది కాదు. నల్లమలను సాంతం మింగేసేదాకా పెట్టుబడులు ఊరుకోవు. వాటి ప్రవేశానికి సాకు మాత్రమే యురేనియం. బిజెపికి దేశభద్రత రూపంలో అది అంది వచ్చిన ఆయుధం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లోబడే అవకాశాలే ఎక్కువ. కనుక ప్రజలే వాళ్ల కళ్లు నోరు తెరిచేలా చేయాలి.

భారతదేశ పర్యావరణానికి కవచం వంటి తూర్పు, పశ్చిమ కనుమలు కాపాడుకోవడం మానవుల, ఇతర జీవజాతుల నిజమైన భద్రత. తూరుపు కనుమల్లో కీలకమైన నల్లమల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రాకృతిక ఆలంబన. అడవి ఆదివాసులకే కాదు, మనందరికీ అమ్మ వంటింది. అసంఖ్యాక వృక్షాలు, జంతువులు, పక్షులు, కీటకాదులను తన ఒడిలో దాచుకుంటుంది. పచ్చని చెట్లు కర్బన విషంతో నిండిన గాలిని వడగట్టి ప్రాణవాయువునిస్తాయి. కొండలు, గుట్టలతో పాటు అవి రుతుపవనాలను నిలువరించి, మేఘాలను కరిగించి వర్షం కురిపిస్తాయి. నదులు, సెలయేర్లు, వాగులు, వంకలు ప్రాణులకు జీవధారలు. తుఫాన్లను ఒడిసి పట్టే చేవ, నేలసారాన్ని నిలిపి ఉంచే పట్టు అడవికి ఉంటుంది. భూగర్భంలో ఖనిజాలను దాచుకోవడం సరే, భూగర్భ జలాలను చుట్టుపక్కల వృద్ధి చేయగల ఒడుపు అడవికి సొంతం. కూర్చున్న చెట్టును నరుక్కుంటే ఎలా ఉంటుందో, అడవిని నరుక్కుంటే అంతకన్నా తీవ్రంగా ఉంటుంది. మనం ఉంటున్న ఇంటిని మనమే తగలబెట్టుకున్నట్లు ఉంటుంది. ఇప్పటికే భూమి నిప్పులు కక్కడం మన అనుభవంలోకి వచ్చింది. వేడి తగులుతోంది. తగలబడ్డమే తరువాయి. ఆ కాసింత అడవీ, ఆ కాసిన్న చెట్లు కొట్టేస్తే అదీ జరుగుతుంది. ʹఅడవి సల్లగుంటే అన్నానికి కొదువే లేదుʹ అని ఆదివాసీ పాడే పాటకు మనందరం కూడా గొంతుకలపాలి. అడవి కోసం ఉద్యమించాలి.

virasam.org, జులై 16 2019

 

No comments:

Post a Comment

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థి...